రాష్ట్రంలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా మార్చామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విధానంతో ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్కు పూర్తిగా చెక్ పడిందని ఆయన పేర్కొన్నారు. గతంలో అమల్లో ఉన్న ఆధార్ ఆధారిత విధానానికి బదులుగా, ఈసారి భూ అనుసంధాన విధానాన్ని అమలు చేసి నిజమైన సాగుదారులకే యూరియా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17.7 లక్షల మంది రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా 59.78 లక్షల యూరియా బ్యాగులను బుక్ చేసుకోగా, అందులో ఇప్పటికే 52.86 లక్షల బ్యాగులను కొనుగోలు చేసినట్లు వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల సరఫరా కొనసాగుతోందని చెప్పారు.
వ్యవసాయ రంగంలో మరిన్ని డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. కృత్రిమ మేధ (AI), ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా వాతావరణ సమాచారం, పంటల పర్యవేక్షణ, ఎరువుల పంపిణీ వంటి సేవలను ఒకే డిజిటల్ వేదికపై రైతులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.









