తెలంగాణ–ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం సచివాలయంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్తో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్, విద్య, నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), యానిమేషన్, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ రంగాల్లో పరస్పర పెట్టుబడులు, సాంకేతిక మార్పిడి, నైపుణ్యాభివృద్ధికి కలిసి పనిచేయాలని ఇరు పక్షాలు అభిప్రాయపడ్డాయి.








