టాటా గ్రూప్కు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గతంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరగడంతో అంతర్జాతీయ విమాన టికెట్లపై విధించిన అదనపు ఇంధన సర్ఛార్జీని తాజాగా తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ముడిచమురు ధరలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
ఈ నిర్ణయంతో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వంటి సుదూర దేశాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికులకు టికెట్ ధరల్లో ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా విదేశాలకు తరచుగా ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మధ్యతరగతి ప్రయాణికులకు ఈ తగ్గింపు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చనుంది.
సవరించిన ధరల ప్రకారం అమెరికా, ఆస్ట్రేలియా రూట్లలో టికెట్పై విధించే ఇంధన సర్ఛార్జీని 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించారు. అలాగే యూరప్, యూకే రూట్లలో 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు కుదించారు. ఈ కొత్త సర్ఛార్జీ రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి.








