మెమొరీ చిప్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు వాటి కొరత తీవ్రం కావడంతో.. దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. అమెరికా రక్షణ శాఖ బ్లాక్లిస్ట్లో పెట్టిన ‘చాంగ్జిన్ మెమొరీ టెక్నాలజీస్’ (CXMT) అనే చైనీస్ కంపెనీ నుంచి మెమొరీ చిప్స్ను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ట్రంప్ సర్కార్ను కోరుతోంది. ఈ మేరకు వైట్హౌస్ అధికారులతో యాపిల్ ప్రతినిధులు ప్రత్యేకంగా లాబీయింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు.
గత వారం రోజులుగా మెమొరీ మరియు స్టోరేజ్ విడిభాగాల ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయని, దీనివల్ల వినియోగదారులపై భారాన్ని తగ్గించలేక ఐప్యాడ్, మ్యాక్బుక్ ధరలను సైతం పెంచాల్సి వచ్చిందని యాపిల్ పేర్కొంది. ఈ ఆర్థిక ఒత్తిడిని అధిగమించాలంటే చైనాకు చెందిన అగ్రగామి చిప్మేకర్ CXMT నుంచి విడిభాగాలను సమకూర్చుకోవడం ఏకైక మార్గమని భావిస్తోంది. ఇందుకోసం వాణిజ్య శాఖ అధికారులను కలిసి తమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
అయితే చైనా సైన్యంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పెంటగాన్ ఈ సంస్థను చైనీస్ మిలిటరీ కంపెనీల జాబితాలో చేర్చింది. దీంతో యాపిల్ ప్రతిపాదనపై వాషింగ్టన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చైనా కంపెనీతో భాగస్వామ్యానికి అమెరికా ప్రభుత్వం అంగీకరిస్తే కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.








