పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దాదాపు 9 నెలల విరామం తర్వాత జైలులో తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్తో ఆయన సతీమణి బుష్రా బీబీ, సోదరి నొరీన్ భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి ఇమ్రాన్ను కలిసేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.
తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు సహా ఎవరినీ కలవనివ్వకపోవడంపై ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఏకాంత నిర్బంధం కారణంగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనకు కుటుంబ సభ్యులతో భేటీకి అవకాశం కల్పించడంతో పాటు వైద్య చికిత్స అందించే అంశంపై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు.








