పినపాక;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆటోలో మహిళ ప్రసవించిన ఘటనపై వైద్యశాఖ విచారణ చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అదనపు డీఎంహెచ్వో ఆదేశాల మేరకు భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీధర్ బృందంతో కలిసి ఘటనపై ఆరా తీశారు.
బాధితురాలు కాలేటి సంధ్య విచారణలో మాట్లాడుతూ, రెండో కాన్పు కావడంతో మొదట సాధారణ నొప్పులేనని భావించానని తెలిపింది. నొప్పులు తీవ్రం కావడంతో ఆశా కార్యకర్త 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చిందని, అయితే అంబులెన్స్ ఆలస్యమవడంతో ఆటోలో మణుగూరు ఏరియా ఆస్పత్రికి బయలుదేరినట్లు పేర్కొంది. అమరావరం దాటిన తర్వాత ఆటోలోనే ప్రసవం జరిగిందని, అనంతరం పాండురంగాపురం వద్ద 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు వివరించింది.
ప్రస్తుతం తాను, తన శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సంధ్య వెల్లడించింది. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీధర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌరీ ప్రసాద్కు తల్లి, శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
అనంతరం జానంపేట పీహెచ్సీని సందర్శించి వైద్యాధికారి, సిబ్బందిని విచారించారు. వైద్యాధికారి పీహెచ్సీ ఆవరణలోని క్వార్టర్స్లోనే 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యశాఖ అధికారులు తెలిపారు.









