మహారాష్ట్రలోని నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వ్యాన్ను ఢీకొట్టడంతో 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి టాటా మ్యాజిక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ఘటనాస్థలిలో విషాదకర పరిస్థితి నెలకొంది.
నివేదికల ప్రకారం.. నాందేడ్-భోకర్ హైవేపై వాకడ్ గ్రామం సమీపంలోని సీతాఖండి ప్రాంతంలో సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భోకర్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వ్యాన్లో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న వెంటనే వ్యాన్ రోడ్డు పక్కకు పడిపోయింది.
ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.









