దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న బ్రిక్స్ సమిట్ 2026 నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సదస్సు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)తో పాటు పలు అత్యవసర విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టాయి.
భద్రతా సన్నద్ధతను పరీక్షించేందుకు నగరంలోని కీలక మెట్రో స్టేషన్లలో ఆయా విభాగాల ప్రతినిధులు సంయుక్తంగా భారీ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వివిధ విభాగాలు ఎంత వేగంగా స్పందిస్తాయి, ప్రయాణికులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, భద్రతా చర్యలను ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశాలను ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలించినట్లు తెలుస్తోంది.
బ్రిక్స్ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఢిల్లీ భద్రతకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, రవాణా మార్గాలు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేస్తున్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమన్వయ లోపాలు లేకుండా చర్యలు తీసుకునేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.








