తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ యూట్యూబర్ రమానందన జాబ్, వీసా మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగాలు, వీసా రెన్యూవల్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నందన విచారణకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు.
దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన విచారణలో కేసుకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కీలకంగా మారిన డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన వివరాలపై నందనను పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు, వీసాల పేరుతో జరిగిన లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వ్యవహారాలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం.
పోలీసుల విచారణలో నందన కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. అయితే ఆమె వెల్లడించిన వివరాలు ఏమిటనే విషయంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








