హుజూర్నగర్, సెప్టెంబర్ 9 (Y7 News Telugu): అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరుతూ హుజూర్నగర్ పట్టణ జర్నలిస్టులు మంగళవారం తహసీల్దార్ బండా కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ కే. సతీష్లకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సరైన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి స్థిరమైన జీతభత్యాలు లేకుండానే సమాజ సేవలో భాగంగా విధులు నిర్వహిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట ప్రాంతంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలకు తక్షణమే పొజిషన్ కల్పించి, గృహ నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జర్నలిస్టులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్కు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.









