పలాస–కాశీబుగ్గ, సెప్టెంబర్ 10:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పల్లివీధిలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కమిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవ కమిటీ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం రాత్రి పల్లివీధిలో వినాయక మండపం నిర్వహణ విషయంలో స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం అందడంతో పలాస పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఇరు వర్గాల వారితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
వినాయక చవితి అందరూ కలిసి జరుపుకునే పండుగ అని, ఉత్సవ కమిటీ ఎన్నికల విషయంలో విభేదాలు తలెత్తినా వాటిని గొడవలకు దారితీయకుండా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఎలక్షన్ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇరు వర్గాలను సముదాయించి, వినాయక చవితి ఉత్సవాలను ఐక్యంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.








