మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. వరుసగా ఏడో రోజు కూడా అమెరికా ఇరాన్లోని పలు మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగించగా, మరోవైపు ఇరాన్ కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య ఇరాన్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
రాజధాని టెహ్రాన్లో ఏర్పాటు చేసిన ఓ భారీ బిల్బోర్డ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్న వివాదాస్పద చిత్రాలను ప్రదర్శించారు. మంటల్లో ఉన్న వైట్హౌస్ నేపథ్యంగా, ట్రంప్, మెలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్, బారన్ ట్రంప్ల చిత్రాలను అమెరికా జెండా కప్పిన శవపేటికల్లో ఉంచినట్లుగా చూపించారు.
ఆ బిల్బోర్డ్పై పర్షియన్ భాషలో “రక్తానికి రక్తం” అనే నినాదాన్ని కూడా ప్రదర్శించారు. ఇటీవల ఇదే తరహాలో ట్రంప్ను మాత్రమే శవపేటికలో చూపించిన మరో బిల్బోర్డ్ను కూడా ఇరాన్ ప్రదర్శించింది. ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న అమెరికా–ఇరాన్ సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశముంది.








