1857 తిరుగుబాటు అనంతరం ముస్లిం సమాజంలో మతపరమైన విద్య, సామాజిక సంస్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో 1866లో ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లో దారుల్ ఉలూమ్ దేవబంద్ స్థాపించబడింది. మౌలానా ఖాసిమ్ నానోత్వీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంస్థ నుంచి దేవబంది భావజాలం భారత ఉపఖండంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. 1947 విభజన తర్వాత భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో ఈ విద్యా వ్యవస్థ వేర్వేరు మార్గాల్లో అభివృద్ధి చెందింది.
తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేవబంద్ సంప్రదాయానికి చెందిన ఖౌమీ (దేవబంది) మదర్సాల సంఖ్య, విద్యార్థుల పరంగా బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేవబంది మదర్సాల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మంది బంగ్లాదేశ్లోనే ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ విస్తరణతో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్లను అధిగమించినట్లు సమాచారం.
బంగ్లాదేశ్లోని బెఫాకుల్ మదరిసిల్ అరబియా గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 32,730 నమోదిత ఖౌమీ మదర్సాలు ఉండగా, వాటిలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇతర ఖౌమీ బోర్డుల పరిధిలోని సంస్థలను కలుపుకుంటే మొత్తం మదర్సాల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు భారత్లో జమియత్ ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలో సుమారు 20,900 మదర్సాలు, 23 లక్షలకు పైగా విద్యార్థులు ఉండగా, పాకిస్థాన్లో సుమారు 27 వేల దేవబంది మదర్సాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.








