నామినేటెడ్ పదవుల్లో సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి
దుమ్ముగూడెం | సెప్టెంబర్ 16 | Y7 న్యూస్ తెలుగు
దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.
గత పదేళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ జెండాను వదలకుండా, సొంత ఖర్చులతో గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీని బలోపేతం చేసిన సీనియర్ కార్యకర్తలు మండలంలో ఎంతోమంది ఉన్నారని సమావేశంలో పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, కేసులు, బెదిరింపులు ఎదురైనా పార్టీ కోసం నిలబడిన కార్యకర్తల సేవలను గుర్తించాలని అన్నారు.
ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకుని జీవితకాలం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి, ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తే సీనియర్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నామినేటెడ్ పదవుల భర్తీలో డబ్బు, పలుకుబడికి కాకుండా సీనియారిటీ, పార్టీ కోసం చేసిన త్యాగం, నిబద్ధతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయడం ద్వారా వారిలో నమ్మకం, ధైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
దుమ్ముగూడెం మండలంలోని నిజమైన, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సేవలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలని పార్టీ జిల్లా నాయకత్వం, అధిష్టానాన్ని సమావేశంలో కోరారు.
– రిపోర్టర్ దివ్య








