తెల్లవారుజామున నిశ్శబ్ద వాతావరణంలో “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ వినిపించే మధుర స్వరం ఎంతోమందికి ఎంఎస్ సుబ్బలక్ష్మిని గుర్తు చేస్తుంది. భక్తి గీతాలు, కీర్తనలు, శాస్త్రీయ సంగీత కచేరీలతో తన ప్రత్యేక గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకున్న ఆమె భారతీయ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆమె చిన్ననాటి పేరు కుంజమ్మ. సంగీత కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంతో అనుబంధం ఏర్పడింది. ఆమె అమ్మమ్మ అక్కమ్మాళ్ వయోలిన్ విద్వాంసురాలు కాగా, తల్లి షణ్ముఖవడివు వీణా విద్వాంసురాలు. ఇంట్లో నిరంతరం సంగీత సాధన కొనసాగడంతో కుంజమ్మకు బాల్యంలోనే సంగీతంపై ఆసక్తి పెరిగింది.
తన ప్రతిభ, కఠోర సాధనతో ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. దేశ, విదేశాల్లో ఎన్నో కచేరీలు నిర్వహించి భారతీయ శాస్త్రీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. ఆమె గాత్రంలో భక్తి, భావం, శాస్త్రీయత కలిసిన ప్రత్యేకత ఉండటంతో తరతరాలుగా శ్రోతలను అలరిస్తూనే ఉన్నారు.








