సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ దక్షిణ ప్రాంతంలోని నగరాలతో పాటు చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య ఇటీవల కుదిరిన ‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’పై చర్చ మొదలైంది. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాల్సి ఉంటుంది.
సౌదీపై దాడులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్, టర్కీ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష సైనిక చర్య కనిపించలేదు. సౌదీపై దాడి జరిగితే ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో పాక్ హౌతీల స్థావరాలపై దాడులు చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ప్రస్తుతం హౌతీలపై ఎలాంటి సైనిక చర్య చేపట్టడం లేదని స్పష్టం చేసింది. సరైన సమయంలో ఒప్పందంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
సౌదీపై దాడులు మరింత తీవ్రతరమై, ప్రాంతీయ భద్రతకు ముప్పు ఏర్పడితే ‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’ను అమలు చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సౌదీపై హౌతీల దాడులు మూడు దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందానికి పరీక్షగా మారాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్, టర్కీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









