E-PAPER

గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి – కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని

పలాస, సెప్టెంబర్ 10 (వై7 న్యూస్): వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు పొందాలని కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆమె పలు కీలక మార్గదర్శకాలను వెల్లడించారు.

మండపాల ఏర్పాటు చేసే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా రహదారులపై లేదా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా, అత్యవసర సేవల వాహనాలు వెళ్లేందుకు తగిన మార్గం ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్‌లు వినియోగించరాదని, ఇతరులకు అసౌకర్యం కలగకుండా శబ్ద నియంత్రణ పాటించాలని హెచ్చరించారు. ప్రతి మండపం వద్ద 24 గంటల పాటు కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండాలని, వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

విద్యుత్ భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని తెలిపారు. వర్షపు సమయంలో విద్యుత్ అలంకరణలను ముట్టుకోవద్దని హెచ్చరించారు.

చందాల వసూళ్ల పేరుతో వ్యాపారులు లేదా ప్రజలను బలవంతపెట్టవద్దని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పాటలు, ప్రసంగాలు, ఫ్లెక్సీలు లేదా సోషల్ మీడియా పోస్టులు చేయరాదని, అలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు పోలీసులు సూచించిన మార్గాల్లోనే నిర్వహించాలని, అధిక ఎత్తు విగ్రహాలను సురక్షితమైన వాహనాలు, క్రేన్లతోనే తరలించాలని డీఎస్పీ భవాని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కాశీబుగ్గ ఎస్‌ఐతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!