పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. యెమెన్కు చెందిన హౌతీ మూకలు సౌదీ అరేబియాలోని చమురు మౌలిక వసతులు, అభా, జిజాన్ విమానాశ్రయాలతో పాటు ఎర్రసముద్రంలోని చమురు నౌకలను డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులు సౌదీ అరేబియా భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచాయి.
ఈ పరిణామం సౌదీ అరేబియా–పాకిస్తాన్ మధ్య ఇటీవల కుదిరిన స్ట్రాటెజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ (SMDA)పై చర్చకు దారితీసింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడిని ఇరు దేశాలపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నప్పటికీ, సౌదీపై దాడుల సమయంలో పాకిస్తాన్ సైనికంగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోవడం ప్రశ్నలను లేవనెత్తుతోంది.
దీంతో ఈ రక్షణ ఒప్పందం వాస్తవంగా ఎలాంటి పరిస్థితుల్లో అమలవుతుంది, దాని పరిధి ఎంతవరకు ఉంటుంది అనే అంశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. సౌదీ భద్రతకు పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందానికి సంబంధించిన ఆచరణాత్మక అంశాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.









