బ్లాక్బస్టర్ ‘బేబీ’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘బేబీ’ కాంబినేషన్ కావడంతో ‘ఎపిక్’పై మొదటి నుంచే యూత్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక సందడి చేశారు. విజయ్ దేవరకొండ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొననున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన వైష్ణవి చైతన్య.. ‘ఎపిక్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘బేబీ’ తరహా సినిమా అనుకుని థియేటర్కు వస్తే ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతి ఎదురవుతుందని ఆమె తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు కడలి అని చెప్పిన వైష్ణవి.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సమయంలో బయటకు రావాలనుకునే ‘కడలి’ ఉంటుందని చెప్పడం విశేషం. ఆమె వ్యాఖ్యలతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.









