పలాస, సెప్టెంబర్ 5 (Y7 న్యూస్): పలాస–టెక్కలి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన దివంగత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్యదొర 13వ వర్ధంతి సందర్భంగా పలాసలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలాసలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ హనుమంతు అప్పయ్యదొర ప్రజా సేవకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అప్పయ్యదొర అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు సాధించారని గుర్తు చేశారు. బెండి పంచాయతీ సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని తెలిపారు.
ఉద్దానం ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి విశేషమని అన్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతానికి ఎంతో కీలకమైన ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన కోసం అప్పయ్యదొర చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.
ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన అప్పయ్యదొర ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవకు అంకితం కావడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అప్పలరాజు పేర్కొన్నారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలాసలోని అప్పయ్యదొర విగ్రహం వద్ద జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు. 13వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.









