మహబూబాబాద్, సెప్టెంబర్ 6 (Y7 న్యూస్):
ఆదివాసి యువతి ఊకే శిరీష మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు చుంచు రామకృష్ణ చేపట్టిన పాదయాత్ర ఆదివారం మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడలోని శ్రీ బాల కుమారస్వామి సన్నిధి వద్ద ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం చెవిటిగూడెం గ్రామం వరకు నాలుగు రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
ఐదు పదుల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఆదివాసి సమాజ హక్కులు, ఆత్మగౌరవం, జల్-జంగిల్-జమీన్ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న చుంచు రామకృష్ణ, శిరీష కుటుంబానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టారు. ఆదివాసి సమాజానికి చెందిన ఒక ఆడబిడ్డ అనుమానాస్పద మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఆదివాసి నాయకులు, సామాజిక కార్యకర్తలు శిరీష మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైమ్ కేర్ హాస్పిటల్ పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ కేసులో పారదర్శక విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని వారు కోరారు. ఆదివాసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు ఈ అంశంపై మరింత బలంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
శిరీషకు న్యాయం, ఆదివాసి హక్కుల పరిరక్షణ, జల్-జంగిల్-జమీన్ నినాదాలతో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు ఆదివాసి సంఘాలు, ప్రజా సంఘాలు, యువత పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నాయి.








