
పాత గొడవలే ప్రాణం తీశాయా?.. శివ హత్య కేసు మిస్టరీ
నేతాజీ గ్రౌండ్లో రక్తపాతం..
మణుగూరులో దారుణ హత్య..
మణుగూరు, ఆగస్టు 27 (Y7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతుడు సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ (28)గా గుర్తించారు. శివ హైదరాబాద్లో ఇంటీరియర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, శివ వద్ద పనిచేసే సుందరయ్య నగర్కు చెందిన సతీష్తో గతంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న ఎంకే గ్యాంగ్ లీడర్ రమాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టి మరియు అతని అనుచరులు శివను మణుగూరుకు వస్తే చంపేస్తామని ఫోన్ ద్వారా బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం (ఆగస్టు 27) ఉదయం 7 గంటలకు శివ హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చాడు. అనంతరం రమాకాంత్ ఫోన్ చేసి నేతాజీ గ్రౌండ్కు రావాలని పిలవడంతో, శివ తన ఇంటి సమీపంలో ఉన్న ఉదయ్కుమార్తో కలిసి అక్కడికి వెళ్లాడు.
అక్కడ ముందుగానే పథకం ప్రకారం వేచి ఉన్న రమాకాంత్, భరత్, సాధిక్, వినయ్, ధినేష్, జంపయ్య, ప్రసాద్ తదితరులు శివపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శివను రక్షించేందుకు ప్రయత్నించిన ఉదయ్కుమార్పై కూడా దాడి చేసినట్లు తెలిపారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.








