భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జన్మించిన జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి ఆమె సోదరి. చిన్నతనం నుంచే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. కేవలం 11 ఏళ్ల వయసులోనే ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.
‘షావుకారు’ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో అప్పటి నుంచి షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. విభిన్నమైన పాత్రలను సహజంగా పోషించిన జానకి.. తన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా పద్మశ్రీతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.








