పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్కు ఇస్లామాబాద్లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షల అనంతరం ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. వైద్యుల బృందం సమగ్రంగా పరీక్షించి, జైలులో కొనసాగేందుకు ఆయన ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నారని నిర్ధారించినట్లు సమాచారం.
పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నేత్ర వైద్య నిపుణుడు, కార్డియాలజిస్ట్, ఫిజీషియన్ సహా పలువురు నిపుణులతో కూడిన వైద్య బృందం ఇమ్రాన్ ఖాన్కు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను మెడికల్గా ఫిట్గా ప్రకటించారని పేర్కొన్నారు.
వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించినట్లు తరార్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గతంలో వచ్చిన ఆందోళనల నేపథ్యంలో ఈ వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.








