ములుగు జిల్లా ప్రతినిధి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భద్రాచలం సారపాక క్వార్టర్స్ నెం.21లో నివసించే ఓ ఉద్యోగి ప్రయాణిస్తున్న కారు మలుపు వద్ద రహదారి సరిగా కనిపించకపోవడంతో అదుపుతప్పి ముందుగా చెట్టును ఢీకొట్టి, అనంతరం రోడ్డుకు పక్కనున్న పొలంలోని గోతిలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో తగిన బందోబస్తు, హెచ్చరిక బోర్డులు, పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఘటనను గమనించిన పంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీ ముక్తి శ్రీను, శ్రీ పోలేబోయిన కుమార్ వెంటనే స్పందించి అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
సమయస్ఫూర్తితో స్పందించి బాధితులకు అండగా నిలిచిన సర్పంచ్ ముక్తి శ్రీను, పోలేబోయిన కుమార్ సేవలను స్థానికులు, గ్రామస్తులు అభినందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









