కొత్తగూడెం, ఆగస్టు 6 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో), అదనపు మండల విద్యాధికారులు (ఏఎంఓలు), సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (సీఎస్ఎఫ్) జిల్లా బృందం, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో FLN కార్యక్రమాల అమలు, విద్యార్థుల అభ్యాస స్థాయిలు, ప్రధాన అభ్యాస లోపాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు నాణ్యమైన తరగతి బోధన, నిరంతర మూల్యాంకనాలు, అభ్యాస లోపాల ఆధారిత ప్రత్యేక బోధన (రిమీడియల్ టీచింగ్), మెంటర్ల క్రమబద్ధమైన పాఠశాల సందర్శనలు, FLN కంపిటెంట్ స్కూల్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యబద్ధమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
రానున్న SCERT నిర్వహించే వార్షిక FLN అంచనాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోని టాప్-5 జిల్లాల్లో నిలపాలనే లక్ష్యాన్ని కలెక్టర్ నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనకు జిల్లా విద్యాశాఖ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ బృందం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
2026–27 విద్యా సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను విద్యా రంగంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆకాంక్షించారు.








