మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్పై కాంగ్రెస్ చేసిన ‘గూంగీ గుడియా’ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో జరుగుతున్న మీడియా సమావేశంలోకి ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు దూసుకెళ్లి నిరసన తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఈ వివాదానికి సోమవారం కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో కారణమైంది. బీడ్ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై ఓ జర్నలిస్ట్ సునేత్ర పవార్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే ఆమెకు అడ్డుగా నిలిచినట్లు ఆ వీడియోలో కనిపించిందని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అంటూ వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఎన్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన వారు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సునేత్ర పవార్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన వాతావరణం ఈ వివాదంతో మరింత ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









