పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నిషేధం ప్రకటించకపోయినా, దేశంలో అల్ జజీరా ఇంగ్లీష్ వెబ్సైట్ అందుబాటులో లేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అల్ జజీరా కథనాలపై తీవ్ర విమర్శలు చేసింది.
PoKలో ఎన్నికలకు సంబంధించిన కొన్ని పోలింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అల్ జజీరా వార్తలు ప్రసారం చేసిందని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. అల్ జజీరా కథనాలను ‘ఎల్లో జర్నలిజం’గా అభివర్ణించిన ప్రభుత్వం.. ఎన్నికల ప్రక్రియను అపఖ్యాతి చేయడంతో పాటు బాహ్య శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. దీంతో పాకిస్తాన్లో మీడియా స్వేచ్ఛపై మరోసారి చర్చ మొదలైంది.
మరోవైపు, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) PoKలో మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ నిలిపివేత, జర్నలిస్టులపై ఆంక్షలు, కొందరు మీడియా ప్రతినిధులు కనిపించకుండా పోవడం ఆందోళనకరమని పేర్కొంది. స్వతంత్ర జర్నలిస్టులు రాజీ తాహిర్, మహ్మద్ సైఫ్ ఆగస్టు 1 నుంచి కనిపించడం లేదని, వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం ఉందని CPJ తెలిపింది. వారు ప్రభుత్వ అదుపులో ఉంటే అధికారికంగా ప్రకటించి, చట్టపరమైన ప్రక్రియను పాటించాలని డిమాండ్ చేసింది.









