పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. స్వాత్ జిల్లాలోని కబల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో శాంతి యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు, తొమ్మిది మంది పౌరులు ఉన్నట్లు మలకండ్ ప్రాంతీయ పోలీస్ అధికారి తెలిపారు.
కబల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శాంతి ర్యాలీ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఆత్మాహుతి దాడేనని అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. దాడి వెనుక ఉన్న వ్యక్తి లేదా సంస్థ వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు.
స్వాత్ అమన్ జిర్గా ఆధ్వర్యంలో ఈ శాంతి యాత్రను నిర్వహించారు. స్వాత్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో స్థానిక ప్రజలు శాంతి, భద్రతను కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు పట్టుకుని, శాంతి కోసం నినాదాలు చేస్తూ యాత్రలో పాల్గొన్నారు. శాంతి కోసం నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.









