జూలై 22లోపు ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి: ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్
పోలవరం జిల్లా, ఎటపాక, జూలై 14 (వై7 న్యూస్): ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్-3ను పునరుద్ధరించి చట్టబద్ధత కల్పించాలని, అలాగే 1/70 చట్టం పరిరక్షణపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
మంగళవారం ఎటపాకలో నిర్వహించిన ఆదివాసి గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో-3కు చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఆదివాసుల పట్ల అన్యాయమని విమర్శించారు.
ఈ నెల 22న రంపచోడవరంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, జీవో-3 అమలు మరియు 1/70 చట్టం పరిరక్షణ అంశాలపై ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని ఆయన కోరారు. ఆదివాసుల హక్కులు, చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, ప్రభుత్వం స్పందించకపోతే ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
సమావేశానికి సవలం రాము అధ్యక్షత వహించగా, సంఘం నాయకులు కాక అర్జున్ దొర, పూనెం వెంకట్రావు, బుద్దుల భద్రయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.
– వై7 న్యూస్








