మణుగూరు, జూలై 14 (వై7 న్యూస్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్ పిలుపునిచ్చారు.
మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిరినాకి నవీన్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయించడంతో పాటు ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫోటో తదితర వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని సూచించారు. అలాగే డూప్లికేట్, ఇతర ప్రాంతాలకు మారిన, మరణించిన ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం సవరించే ప్రక్రియను బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని తెలిపారు.
మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, ఇన్చార్జీలు, సూపర్వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి పంచాయతీలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు అంశంపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
అదేవిధంగా గ్రామాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల సమన్వయం, పార్టీ కార్యక్రమాల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో సర్పంచులు ఎనిక శ్వేత, కలబోయిన మాధవరావు, మడకం కృష్ణ, పూనెం రమేష్, శెట్టిపల్లి మాధవి, పాల్వంచ రాములు, జగిడి ప్రసాద్, కారం పూజ, ఉప సర్పంచులు కోటం మనోజ్ కుమార్, గోరంట్ల కనకయ్య, కొమరం మహేష్, కొమరం మధుకిరణ్, కుంజ శ్రీను, శెట్టిపల్లి గోపాల్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బర్ల శ్వేతన్, ఎనిక బాలకృష్ణ, సిరపు గణేష్ రెడ్డి, బల్లెం సురేష్ తదితరులు పాల్గొన్నారు.








