మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి ప్రజల ప్రయోజనాల కోసం సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో భారీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. సింగూరు ప్రాజెక్టు నీటిని పూర్తిగా ఖాళీ చేశారని ఆరోపించిన ఆయన, క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు తగిన పరిహారం కూడా అందలేదని విమర్శించారు. పంటల బీమా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్కాముల ప్రభుత్వం నడుస్తోందని, ప్రజలకు మేలు చేసే పాలన కోసం మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపైనా హరీష్ రావు స్పందించారు. తన ఎత్తును ప్రస్తావిస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కనిపిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.









