స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలవడం ప్రజాప్రతినిధుల హక్కేనని, తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాత్రమే దేవాదాయ శాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేశానని, జిల్లా లేదా రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించలేదని తెలిపారు.
సమీక్షకు, అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి తేడా ఉందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. “అధికారులు నా వద్దకు వస్తే అది సమీక్ష.. నేను వారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇస్తే అది రిప్రజెంటేషన్ మాత్రమే” అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, మంత్రి తన చర్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
అనవసర రాజకీయ వివాదాల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు. వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీటి సరఫరా, ఎంజీఎం ఆస్పత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్ నియామకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం, నగర అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యల వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.









