దుమ్ముగూడెం, జూలై 9 (వై7 న్యూస్): దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుషిని రవి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం కుషిని రవి తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవి ప్రసన్న, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల రమేష్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్లం హరికృష్ణలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కుషిని రవి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తూనే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు పార్టీ అండగా నిలిచేలా పనిచేస్తానని చెప్పారు.
కుషిని రవి నియామకంపై మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.








