మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు మతం మారినా రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగాలన్నదే ప్రభుత్వ వాదనగా పేర్కొంది.
2024లో అప్పటి డీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన హిందువులు ఇస్లాంలోకి మారిన తర్వాత కూడా వారికి బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) కేటగిరీలో రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. మత మార్పిడి కారణంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు తమ రిజర్వేషన్ హక్కులను కోల్పోకుండా ఉండటమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
అయితే ఈ ప్రభుత్వ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది. కేవలం మతం మారినంత మాత్రాన రాష్ట్రం గుర్తించిన బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం వర్గాల్లో సభ్యత్వం లభించదని స్పష్టం చేసింది. అన్సార్, డెక్కని ముస్లింలు, దుబెకులా, లబ్బాయి, మాపిళ్ల, షేక్, సయ్యద్ వంటి వర్గాలు జన్మ ఆధారిత సామాజిక వర్గాలని, మత మార్పిడి ద్వారా వాటిలో సభ్యత్వం పొందలేమని పేర్కొంది. ఈ వివాదంపై తుది నిర్ణయం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో వెలువడనుంది.








