పలాస, జూలై 6 (వై 7 న్యూస్): ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ K. V. Maheshwara Reddy సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (పీజీఆర్ఎస్) లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 57 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా జాప్యానికి తావు లేకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన ఎస్పీ, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కుటుంబ వివాదాలు, పౌర సంబంధిత సమస్యలు, ఆస్తి తగాదాలు, మోసపూరిత ఘటనలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 57 ఫిర్యాదులు స్వీకరించబడినట్లు అధికారులు తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ఎస్పీ పేర్కొన్నారు.








