కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ వినియోగానికి వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం కార్ల యజమానులు ఆందోళన చేపట్టి, E20 పెట్రోల్ వల్ల తమ వాహనాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఈ ఇంధనాన్ని వేగంగా అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన తొలి నిరసనగా దీనిని నిర్వాహకులు పేర్కొన్నారు.
‘హమారా గాడీ.. హమారా అధికార్’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీవీ నటుడు, వ్యాపారవేత్త తెహ్సీన్ పూనావాలా, ఆటోమొబైల్ నిపుణులు, చమురు రంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. తమలో కొందరు బీజేపీ మద్దతుదారులు కూడా ఉన్నప్పటికీ, వాహనదారుల సమస్యల దృష్ట్యా నిష్పాక్షికంగా ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆందోళనకారుల ప్రకారం.. E20 పెట్రోల్ వాడకం వల్ల కార్ల మైలేజ్ తగ్గుతోందని, వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని, ఫ్యూయల్ ఫిల్టర్లు దెబ్బతింటున్నాయని, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కారణంగా భారీ మరమ్మతులు చేయాల్సి వస్తోందని తమ అనుభవాలను వివరించారు. చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వెనుక చక్కెర పరిశ్రమల లాబీయింగ్ ఉందని కూడా విమర్శించారు.
ఇదిలా ఉండగా, E20 పెట్రోల్ అమలుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు డీజిల్లో కూడా ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపడుతోంది. అయితే E20పై వాహనదారుల ఆందోళనలు, ప్రభుత్వ వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చ మరింత ముదురుతోంది.








