మెదక్ జిల్లా తూప్రాన్ డిసెంబర్ 30:-
మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానాలు,కేసుల నమోదు,దర్యాప్తు పురోగతి తదితర అంశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సవివరంగా పరిశీలించారు.నేరాల నియంత్రణలో మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని,ముఖ్యంగా పునరావృత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని తూప్రాన్ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని,ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని తెలిపారు.ఆస్తి సంబంధిత నేరాలు,దొంగతనాలు,చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు డివిజన్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ప్రజల భద్రతే పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.









