శ్రీకాకుళం జిల్లా, పలాస | వై7 న్యూస్
మలేషియాలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు యువకులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో వారి తిరుగు ప్రయాణానికి అవసరమైన చర్యలు వేగవంతమయ్యాయి.
ఉపాధి అవకాశాల కోసం ఆగస్టు 12న విజిటింగ్ వీసాపై మలేషియా వెళ్లిన యువకులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధితుల్లో వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్, సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీ ఉన్నారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
యువకుల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించినట్లు సమాచారం. మలేషియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి యువకుల విడుదలతో పాటు వారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మంత్రి చొరవతో గురువారం యువకులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోనున్న నేపథ్యంలో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.









