గజపతి జిల్లా మోహన బ్లాక్ పరిధిలోని చంద్రగిరి రేంజ్ అటవీ అధికారులు గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. దడియాంబో-చంద్రగిరి రోడ్డులోని జగన్నాథపురం వద్ద ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న మహీంద్రా మ్యాక్సీ పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో 42 కటింగ్ టేకు ముక్కలు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు కొలతలు, బరువును పరిశీలించారు.
అటవీ అధికారుల వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న టేకు కలప మొత్తం 15.88 చదరపు అడుగులు ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ రూ.లక్షకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై ఒడిశా అటవీ చట్టం కింద చంద్రగిరి రేంజ్ అధికారులు కేసు నమోదు చేశారు.
అటవీ అధికారులు వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు డివిజనల్ ఫారెస్టు అధికారి కె. నాగరాజు తెలిపారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసేందుకు అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న కలప, వాహనాన్ని తదుపరి విచారణలో భాగంగా అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.









