E-PAPER

భారత్‌తో స్నేహం కోరుకుంటున్న చైనా.. జిన్‌పింగ్ పర్యటన వేళ కీలక సందేశం

భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న 2026 BRICS శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్న సందర్భంగా బీజింగ్ నుంచి స్నేహపూర్వక సందేశం వెలువడింది. ఇరు దేశాలు మంచి పొరుగు దేశాలుగా వ్యవహరిస్తూ, ఒకరి అభివృద్ధికి మరొకరు సహకరించుకునే భాగస్వాములుగా ముందుకు సాగాలని చైనా ఆకాంక్షించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తుండటంతో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చైనా రాయబారి వెల్లడించారు.

అగ్రనేతల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని బీజింగ్ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక బంధాన్ని తక్షణ ప్రయోజనాలకే పరిమితం చేయకుండా దీర్ఘకాలిక, వ్యూహాత్మక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పరస్పర సమాచార మార్పిడిని పెంచుకోవడం, కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించడం, అలాగే భేదాభిప్రాయాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సంబంధాల్లో స్థిరత్వాన్ని కొనసాగించాలని చైనా అభిప్రాయపడింది.

సరిహద్దు వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా భారత్-చైనా సంబంధాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విభేదాలు ఉన్నప్పటికీ అవి ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి అడ్డంకిగా మారకూడదనే సంకేతాన్ని చైనా తాజా ప్రకటన ద్వారా ఇచ్చింది. వరుసగా మూడో ఏడాది మోదీ, జిన్‌పింగ్ ముఖాముఖిగా సమావేశం కానుండటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో రష్యాలోని కజాన్, చైనాలోని తియాంజిన్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!