దుమ్ముగూడెం, సెప్టెంబర్ 12 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బైరాగులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న ఓ మహిళ ఒక్కసారిగా కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె కాలుకు గాయం కాగా, బెణికినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న Y7 News సర్పంచ్ను చరవాణి ద్వారా సంప్రదించగా, మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ను తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న మల్టీపర్పస్ వర్కర్ ప్రమాదవశాత్తు కిందపడిందని, ఆమెకు కాలికి గాయం అయినట్లు వివరించారు.
అలాగే గతంలో పనిచేసిన ట్రాక్టర్ డ్రైవర్కు జీతాలు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగం మానేశాడని సర్పంచ్ వై 7 న్యూస్ కు తెలిపారు.
అయితే ప్రమాదం జరిగిన ఖచ్చితమైన పరిస్థితులు, గాయపడిన మహిళ ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందిస్తున్న వైద్య చికిత్స తదితర అంశాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
– రిపోర్టర్ దివ్య









