పాత స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి వాట్సాప్ భారీ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 8, 2026 నుంచి ఆండ్రాయిడ్ 5.0, 5.1 (లాలీపాప్) ఆపరేటింగ్ సిస్టమ్లపై నడిచే ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ పాత వెర్షన్లలో యాప్ ఓపెన్ చేసినప్పుడు సేవలు ఇక అందుబాటులో ఉండవని సూచించే అలర్ట్ కనిపిస్తుంది. దీంతో ఈ ఫోన్లలో ఇకపై వాట్సాప్ను సాధారణంగా ఉపయోగించడం సాధ్యం కాదు.
వాట్సాప్ వినియోగాన్ని కొనసాగించాలంటే యూజర్లకు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటే వెంటనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్కు అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ తయారీ సంస్థ నుంచి కొత్త అప్డేట్లు అందకపోతే, వాట్సాప్ వినియోగం కోసం కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇకపై వాట్సాప్ సేవలకు కనీసం ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మెల్లో లేదా అంతకంటే కొత్త వెర్షన్ అవసరం.
అయితే ఈ నిర్ణయం వాట్సాప్ అకస్మాత్తుగా తీసుకున్నది కాదు. పాత ఆండ్రాయిడ్ వెర్షన్లకు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు కంపెనీ ముందుగానే ప్రకటించింది. భారత్, పాకిస్తాన్, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇప్పటికీ పాత ఆండ్రాయిడ్ వెర్షన్లతో పనిచేసే ఫోన్లను చాలామంది ఉపయోగిస్తున్నారు. కొత్త సెక్యూరిటీ అప్డేట్లు, అధునాతన ఫీచర్లు పాత ఆపరేటింగ్ సిస్టమ్లలో సరిగా పనిచేయకపోవడంతో భద్రత, మెరుగైన యూజర్ అనుభవం కోసం వాట్సాప్ కాలానుగుణంగా పాత వెర్షన్లకు సపోర్ట్ను నిలిపివేస్తోంది.









