శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మర్యాదపూర్వకంగా కలిసి పలాస నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మందస మండలం బెల్లిపాటియా వద్ద ఉన్న ఆక్వాడక్ట్ మరమ్మతులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేసి పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ఆక్వాడక్ట్ రైతాంగానికి ఎంతో కీలకమని, మరమ్మతులు పూర్తయితే సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన ఇరిగేషన్ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వజ్రపుకొత్తూరు మండల రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసి, పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పలాస నియోజకవర్గ అభివృద్ధి, రైతాంగ సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ప్రజలకు మెరుగైన వసతులు, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
“పలాస నియోజకవర్గ అభివృద్ధే కూటమి ప్రభుత్వం ధ్యేయం.. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.









