ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు పిల్లలను, టీనేజర్లను బానిసలుగా మారుస్తున్నారనే ఆరోపణలపై అమెరికాలో దాఖలైన కేసులో మెటా కీలక ఒప్పందానికి వచ్చింది. దాదాపు అన్ని రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, కొన్ని అమెరికా ప్రాంతాల అటార్నీ జనరల్స్తో కుదిరిన ఈ సెటిల్మెంట్లో భాగంగా మెటా వచ్చే పదేళ్లలో గరిష్ఠంగా 18 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మొత్తంలో కొంత భాగం ఇతర సోషల్ మీడియా సంస్థలు కూడా ఇలాంటి నిబంధనలను అంగీకరిస్తే చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్లలోపు వినియోగదారుల కోసం సోషల్ మీడియా వినియోగంపై పలు ఆంక్షలు తీసుకురానున్నారు. రోజువారీ వినియోగ సమయాన్ని పరిమితం చేయడం, అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు యాప్ యాక్సెస్ను తల్లిదండ్రుల అనుమతి లేకుండా నిలిపివేయడం, స్కూల్ సమయంలో నోటిఫికేషన్లను తగ్గించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. అలాగే పేరెంటల్ కంట్రోల్స్, వయసు నిర్ధారణ, డిఫాల్ట్ సేఫ్టీ సెట్టింగ్స్ను మరింత కఠినతరం చేయనున్నారు.
అమెరికాలో జరుగుతున్న ఫెడరల్ కోర్టు విచారణను ముగించే దిశగా ఈ ఒప్పందం కుదిరింది. అయితే సెటిల్మెంట్లో భాగంగా మెటా ఎలాంటి తప్పును అంగీకరించలేదు. పిల్లల భద్రతకు సంబంధించిన ఈ నిర్ణయం సోషల్ మీడియా సంస్థలపై భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ ఒప్పందంలో చేరకుండా తమ కేసులను కొనసాగిస్తున్నాయి.








