కరకగూడెం, ఆగస్టు 20 (వై సెవెన్ తెలుగు న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో ఉన్న సారలమ్మ ఆలయానికి కనీస మౌలిక వసతులు కల్పించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రధాన రహదారి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఆలయానికి రోడ్డు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు, స్థానిక రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
సారలమ్మ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, వారంలో రెండు రోజులు ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారని తెలిపారు. రద్దీ సమయాల్లో సరైన రహదారి లేకపోవడం వల్ల ఆలయానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత 20 ఏళ్లుగా ఆలయంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు రాకపోకలకు మార్గం ఉండేదని, ప్రస్తుతం అది సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, ఆలయానికి వెళ్లే మార్గం ఇబ్బందికరంగా మారడంతో భక్తులు నడిచి వెళ్లేందుకు కూడా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆలయం చుట్టుపక్కల వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు కూడా రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రధాన రహదారి నుంచి సారలమ్మ ఆలయం వరకు శాశ్వత రహదారిని నిర్మించడంతో పాటు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని గోగ్గల కృష్ణ డిమాండ్ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పూజారి పోలేపోయిన నరసయ్యతో పాటు భక్తులు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్








