కేశవాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
కేశవాపురం, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేశవాపురం గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ కాపుల శారద అధ్యక్షతన కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కాపుల శారద మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు కొమురం భీమ్ అని అన్నారు. “జల్, జంగల్, జమీన్” నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆదివాసీ సమాజం కోసం ఆయన చేసిన సేవలు, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
కొమురం భీమ్ ఆశయాలను ఆదివాసీ యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తమ హక్కులపై అవగాహన పెంచుకుని సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో కూనారపు సతీష్, కాపుల నాగరాజు, కోరం నాగేంద్ర, తాటి పాపారావు, హిమగిరి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, సూరిబాబు, రామారావు, కృష్ణ, సుబ్బారావు, శ్రీను, రాధా తదితరులతో పాటు గ్రామ ప్రజలు, ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు పాల్గొని కొమురం భీమ్కు ఘన నివాళులు అర్పించారు.








