పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నూతన వాహన విధానానికి (New Vehicle Policy) ఆమోదం తెలిపింది. ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-వాహనాలపై ఇక నుంచి ఎలాంటి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదని స్పష్టం చేసింది. దీనివల్ల సామాన్యులకు ఈవీలు మరింత చవకగా లభించే అవకాశం ఉంది.
మరోవైపు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 2028 సంవత్సరం తర్వాత నగరంలో కొత్తగా పెట్రోల్, డీజిల్ ఆధారిత ద్విచక్ర వాహనాల (పెట్రోల్ బైక్స్) రిజిస్ట్రేషన్ను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ సరికొత్త విధానం ద్వారా రాబోయే కొన్నేళ్లలో నగరంలో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈవీల వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేసింది. ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.








