– లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
– రౌడీషీటర్లకు డిఎస్పి అరుణ్ కుమార్ కౌన్సిలింగ్
భద్రాచలం,
భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు డి.ఎస్.పి అరుణ్ కుమార్ శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డి.ఎస్.పి రౌడీషీటర్ల ప్రవర్తన, వారి ప్రస్తుత జీవన విధానంపై ఆరా తీశారు. ఎవరెవరు ఏ ఏ కేసులలో ఉన్నారో క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత రౌడీషీటర్ల యొక్క జీవనశైలిని వారినే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత నేర ప్రవృత్తిని మరియు నేరాలను విడనాడి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని హితవు పలికారు. నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. తమ ప్రవర్తన మార్చుకుని పట్టణంలో ఎలాంటి అలజడి సృష్టించకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉన్న వారిని రౌడీషీటర్ల జాబితా నుండి తొలగించేందుకు కృషి చేస్తామని, లేనియెడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








