మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రహదారిని తక్షణమే మరమ్మతులు చేసి, లైటింగ్ ఏర్పాటు చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు, దుమ్ము-ధూళి సమస్యలను నివారించి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలను కాపాడాలని కోరారు.
ఈ మేరకు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు బొగ్గు టిప్పర్లు, ఇసుక లారీలు మరియు ఇతర వాహనాల భారీ రాకపోకల కారణంగా రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని తెలిపారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు దెబ్బతిన్న ప్రదేశాల్లో బీటీ ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉండగా, దుబ్బ, యాష్, కంకర వేయడం వల్ల వాహనాలు వెళ్లే సమయంలో తీవ్రమైన దుమ్ము లేస్తోందని, ప్రయాణం కష్టసాధ్యంగా మారిందని అన్నారు.
ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ఆర్ & బి అధికారులకు ఫోన్ చేసి రోడ్డు మరమ్మతులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సాంబాయిగూడెం గ్రామంలోని విద్యుత్ మరియు ఇతర స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మధుసూదన్ రెడ్డి కోరారు.








